విశాఖ ఏజెన్సీలో హిందూ ధర్మ ప్రచార యాత్ర...
అరకులోయలో మెగా వైద్య శిబిరం
విశాఖపట్నం, పెన్ పవర్విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర రెండు రోజులపాటు విశాఖ ఏజెన్సీలో కొనసాగనుంది. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి, గురు, శుక్రవారాల్లో అరకు, పాడేరు ప్రాంతాల్లో పర్యటిస్తారు. హిందూ ధర్మంపై గిరిజనుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు పలు మారుమూల అటవీ గ్రామాల్లో పర్యటిస్తారు. అరకు, హుకుంపేట, పాడేరు, జి. మాడుగుల మండలాల్లో ఈ పర్యటన సాగుతుంది. యండపల్లివలస, సొంపి, ఉక్కుర్భ, అడ్డుమండ, మఠం, మత్స్యగుండం, కిండంగితో పాటు ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లోని పాడువ గ్రామాల మీదుగా యాత్ర ఉంటుంది. జి. మాడుగులలో గిరిపుత్రులను ఉద్దేశించి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి అనుగ్రహభాషణం చేస్తారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి ఆదేశాలతో ధర్మ ప్రచారంతో పాటు పలు సేవా కార్యక్రమాలను సైతం ఈ యాత్రలో భాగంగా నిర్వహిస్తున్నట్లు స్వాత్మానందేంద్ర స్వామి తెలిపారు. 25వ తేదీ ఉదయం అరకు ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసామని వివరించారు. కంటి పరీక్షలు, దంత వైద్య పరీక్షలు, ఆర్థోపెడిక్, ఆస్తమా, మధుమేహం, కార్డియాలజీ, క్యాన్సర్, చర్మ వ్యాధులు, పెడియాట్రిక్స్ విభాగాలకు చెందిన వైద్యులు ఈ శిబిరంలో అందుబాటులో ఉంటారని అన్నారు. ఈ అవకాశాన్ని గిరిజనులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎన్నారై హాస్పిటల్స్ వైద్య బృందం' గురుదేవా ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుల సహకారంతో ఈ వైద్య శిబిరాన్ని చేపట్టామని చెప్పారు. వైద్యశిబిరం అనంతరం అదే వేదికపై సాయంత్రం 6 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుందని చెప్పారు. 26వ తేదీ పాడేరు అటవీప్రాంతంలోని మోక్షగుండం పుణ్యక్షేత్రాన్ని, మధ్యాహ్నం మోదకొండమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శిస్తామని తెలిపారు.
No comments:
Post a Comment