కరోనా మృతునికి అంత్యక్రియలు నిర్వహించి, మానవత్వాన్ని చాటుకున్న పురపాలక సిబ్బంది
తొర్రూరు, పెన్ పవర్
కరోనా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు రక్తసంబంధీకులు, బంధువులు ముందుకు రాకపోవడంతో తొర్రూరు మున్సిపల్ కమిషనర్ గుండె బాబు ఆదేశాల మేరకు. పురపాలక సిబ్బంది మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి, మానవత్వాన్ని చాటుకున్నారు.శనివారం మహబూబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో కరోనాతో బాధపడుతున్న 58 ఏళ్ల వయసున్న వ్యక్తి మరణించగా, దహన సంస్కారాలు చేయడానికి బంధువులు భయపడ్డారు.అలాంటి సమయంలో కూడా మృతుని బంధుమిత్రులు సాయం పట్టడానికి ముందుకు రాలేదు. నాలుగో వ్యక్తి ఎవరైనా వస్తారా అని అరగంట సేపు ఎదురుచూసినా ఫలితం లేదు. దీంతో పురపాలక పారిశుద్ధ్య సిబ్బంది మృతదేహన్ని ప్యాకింగ్ చేసి, బయటకు తీసుకు రావడానికి వారికి గంటకు పైగా సమయం పట్టింది.పట్టణంలోని హరిపిరాల రోడ్డులోని స్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు.కొవిడ్ మహమ్మారి బంధాలను చిదిమేస్తోంది. బతికి ఉన్నప్పుడు ఆలింగనం చేసుకున్నవారు, మరణించాక మృతదేహం వద్దకు వచ్చేందుకు కూడా సాహసించడం లేదు. కుటుంబ సభ్యులు మరణించినా అనవసరమైన అపోహలతో అంత్యక్రియలకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో ఆత్మబంధువుల్లా మారి, మునిసిపాలిటీ సిబ్బంది చనిపోయిన వారి మతాచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, కమిషనర్ గుండె బాబు లు మాట్లాడుతూ... కరొనాతో మరణిస్తే బంధువులు భయపడుతున్నారని, తాము కూడా కొవిడ్ బారిన పడతామని ఆందోళన చెందుతున్నారన్నారు. మృతదేహానికి ప్యాకింగ్ చేసి, పీపీఈ కిట్లు ధరించి, అంత్యక్రియలు నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. కొవిడ్తో మరణించిన వారి శరీరంలో కనిష్ఠంగా 3, గరిష్ఠంగా 6గంటలు మాత్రమే వైరస్ ఉంటుందన్నారు.ఆ తర్వాత మృతదేహంలో ఎలాంటి వైరస్ ఉండదని, మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. అందరికీ ఆత్మీయతను పంచినవారు మరణిస్తే గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించడం కుటుంబ సభ్యులు, బంధువుల బాధ్యత అన్నారు.కరోనాపై ప్రజల్లో అపోహలు దూరం చేసేందుకు ప్రయత్నించాలన్నారు.ఈ అంత్యక్రియల్లో ఆర్ఐ రాకేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ కొమ్ము దేవేందర్,వీఆర్ఏ రాంబాబు,తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment