వ్యాధిగ్రస్తుల గుర్తింపు కోసం కొనసాగుతున్న ముమ్మర నిఘా : జిల్లా కలెక్టర్
ఇప్పటి వరకు 2325 శాంపిల్స్ సేకరణ, 2075 నెగటివ్, మరో 250 పెండింగ్
విజయనగరం, పెన్ పవర్
జిల్లాలో గ్రామాలు, పట్టణాల్లో కరోనా వ్యాధిగ్రస్తుల గుర్తింపు కోసం వైద్య బృందాలతో ముమ్మరంగా నిఘా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు. దీనిలో భాగంగా వ్యాధి లక్షణాలతో ఉన్నవారిని పెద్ద ఎత్తున గుర్తించి వారి నుండి శాంపిల్స్ సేకరిస్తున్నట్టు పేర్కొన్నారు. వృద్ధాప్యంలో వున్న వారి శాంపిల్స్ సేకరణ కుడా చేస్తున్నామని చెప్పారు. శ్వాశ కోశ వ్యాధులతో బాధపడుతున్న వారి నుండి కూడా శాంపిల్స్ సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నట్టు వెల్లడించారు. జిల్లా సరిహద్దున వున్న మండలాల్లో నివసించే ప్రజానీకానికి కూడా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నట్టు చెప్పారు. దీనికోసం ప్రత్యెక డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 2325 శాంపిల్స్ సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరపగా 2075 మందికి నెగటివ్ గా వచ్చిందని, మరో 250 శాంపిల్స్ కి సంబంధించి ఫలితాలు రావలసి ఉందన్నారు. గురువారం ఒక్క రోజే జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 331 శాంపిల్స్ సేకరించడం జరిగిందన్నారు.
అన్ని చెక్ పోస్టుల్లో వైద్య సిబ్బంది నియామకం
జిల్లాలోని సరిహద్దు నాలుగు మండలాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో వైద్య తనిఖీలు చేపట్టడం కోసం ఏడుగురు వైద్య సిబ్బందిని నియమించనున్నట్టు ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ కేతన్ గార్గ్ తెలిపారు. కోవిడ్ ప్రోగ్రాం అధికారులతో గురువారం కలెక్టర్ కార్యాలయంలో శాంపిల్స్ సేకరణపై సమీక్షించారు. వ్యాధి లక్షణాలతో వున్న వారిని మాత్రమే గుర్తించి వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ప్రతిపాదించాలని సూచించారు.
No comments:
Post a Comment