డ్వాక్రా మహిళలకు మరో వరం
నేడు సున్నా వడ్డీ పంపిణీకి ఏర్పాట్లు
జిల్లాలో 5 లక్షల మందికి లబ్ది
సుమారు రూ.34కోట్లు పంపిణీ
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్
విజయనగరం, పెన్ పవర్
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన మరో వరం నేడు కార్యరూపం దాల్చనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి డ్వాక్రా మహిళలకు ఇచ్చిన సున్నా వడ్డీ పథకం అమలుకు రంగం సిద్దమయ్యింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఉదయం 11 గంటలకు రాజధాని నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. అదే సమయంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో శాసన సభ్యులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, మహిళలకు చెక్కులను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమాలను నిరాడంబరంగా, భౌతిక దూరాన్ని పాటిస్తూ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.
జిల్లాలో సున్నా వడ్డీని శుక్రవారం మహిళలకు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో సుమారు 5 లక్షల మంది డ్వాక్రా సంఘాల మహిళలు లబ్ది పొందనున్నారని, వీరికి దాదాపు రూ.34 కోట్లు పంపిణీ చేయనున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతంలోని 37,592 గ్రూపులకు చెందిన సుమారు 4,29,844 మంది మహిళలకు రూ.23కోట్ల, 29లక్షల రూపాయలను డిఆర్డిఏ ద్వారా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. అలాగే బొబ్బిలి, నెల్లిమర్ల, విజయనగరం, పార్వతీపురం, సాలూరు మున్సిపాల్టీల్లో 7,264 స్వయంశక్తి సంఘాల్లోని 80,647 మంది డ్వాక్రా సంఘాల సభ్యులకు మెప్మా ద్వారా రూ.10కోట్ల, 64లక్షల, 71వేలను అందజేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ముఖ్యమంత్రి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్, ఇతర అధికారులు పాల్గొంటారు.
No comments:
Post a Comment