మాడుగుల మండల టిడిపి అధ్యక్ష పదవీ యువకులకే కేటాయించాలి
పాత వారికి ఇస్తే రాజీనామాలకు సిద్ధం పార్టీ శ్రేణులువి.మాడుగుల, పెన్ పవర్
తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన మాడుగుల మండలం పార్టీ అధ్యక్ష పదవి ఎంపికలో సందిగ్ధత కొనసాగుతుంది. పార్టీ బలోపేతానికి సమర్థవంతమైన నాయకత్వాన్ని తీసుకు రావాల్సి ఉంది. కానీ స్థానిక పార్టీలో నెలకొన్న అనిశ్ఛితి కారణంగా అధ్యక్ష పదవి ఎన్నిక ప్రశ్నార్థకంగా మారింది. మారుతున్న రాజకీయ పరిస్థితుల కారణంగా యువతకు అవకాశం ఇస్తే చతికిలపడిన పార్టీలో ఉత్తేజం వస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. కానీ టిడిపి మండల అధ్యక్ష పదవికి పాత పేర్లు తెరపైకి రావడంతో యువకుల్లో అసహనం వ్యక్తం అవుతుంది. పార్టీ భవిష్యత్ దృశ్య కొత్తవారికి అవకాశం ఇస్తే ప్రయోజనం ఉంటుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. నియోజకవర్గంలోని కే కోటపాడు దేవరపల్లి చీడికాడ మండలాల్లో టిడిపి అధ్యక్షుల ఎన్నికలు జరిగాయి. మాడుగుల మండలంలో టిడిపి అధ్యక్ష పదవికి గాది రాయి మాజీ సర్పంచ్ అద్దెపల్లి జగ్గారావు మాజీ ఎంపీపీ పుప్పాల అప్పలరాజు పేర్లు తెరపైకి వచ్చాయి. ఇద్దరు గతంలో మండల పార్టీ అధ్యక్షులుగా చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీరిరువురి పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల పార్థసారథి ఆలయం వద్ద టిడిపి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీకి చెందిన పలువురు యువకులు మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అడ్డు తగిలారని యువకులు ఆరోపిస్తున్నరు. ఎంతో కాలంగా పార్టీలో ఉన్నప్పటికీ అవకాశం ఇవ్వకుండా నాయకులు మోకాలడ్డు తున్నారని మండలానికి చెందిన ఒక వ్యక్తి బాహటంగా ఆరోపించారు. 29 పంచాయతీల్లో సమర్థవంతమైన యువకుడిని ఎంపిక చేస్తే పార్టీలో నూతన ఉత్తేజం వస్తుందని అంటున్నారు. మాడుగుల పట్టణంలో అధ్యక్ష పదవి ఇవ్వాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. రెండో వ్యక్తికి పార్టీ అధ్యక్ష పదవి అప్పగిస్తే పార్టీకి దూరం కావాలని పలువురు భావిస్తున్నారు.
ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో మాడుగుల లో సర్పంచ్ గా టీడీపీ అభ్యర్థి పోటీ చేయడానికి ఇష్టపడని ఆ వ్యక్తి కి పార్టీ సంక్షేమం పడుతుందా? గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రామానాయుడు ఓటమికి ఈ వ్యక్తే కారణమని పార్టీ వర్గాలు ఆ వ్యక్తిని దూరంగా ఉంచిన విషయం తెలిసిందే. టీడీపీ నుంచి ప్రజారాజ్యం లోకి వెళ్లి మళ్లీ టీడీపీ లోకి వచ్చిన వ్యక్తి పార్టీ శ్రేయస్సుకోసం ఏ మేర ఆలోచిస్తారని పార్టీ వర్గాలు సంకోచిస్తున్నాయి.ఈ విషయంలో నియోజకవర్గ ఇంచార్జ్ రామానాయుడు కూడా తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్నా సామెత ఇక్కడ ప్రత్యక్షమైంది. నాడు తన ఓటమికి కారకుడైన వ్యక్తికి మండల పార్టీ పదవి అప్పగిస్తారా? అని చర్చ సాగుతోంది. ఇప్పటికే ఈవిషయం జిల్లా అధిష్టానం దృష్టికి కొందరు తీసుకు వెళ్లినట్లు సమాచారం. నియోజకవర్గ ఇన్చార్జికి కూడా ఆ వ్యక్తికీ పదవి ఇవ్వద్దని సంకేతాలు వెళ్ళినట్లు తెలుస్తుంది. కొందరు నాయకుల కారణంగా అసమ్మతి తో పార్టీకి దూరంగా ఉన్న వ్యక్తులు ఈ వ్యక్తి నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తప్పనిసరి ఆ వ్యక్తికి అధ్యక్ష పదవి కేటాయిస్తే తాము పార్టీ వీడుక తప్పదని వారు స్పష్టం చేస్తున్నారు. మండలంలో నెలకొన్న పార్టీ పరిస్థితుల దృష్ట్యా జిల్లా నాయకత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని టిడిపి యువత కోరుతున్నారు.
No comments:
Post a Comment