పురపోరులో గెలిచి ఓడిన వైసిపి
ఎమ్మెల్యే ఓటుతో పీఠం కైవసం
మున్సిపాలిటీ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లయింది. నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఎక్స్ అఫిషియో ఓటింగ్ తో మున్సిపాలిటీ పై తొలిసారి టిడిపి యేతరపార్టీ జెండా ఎగురవేసింది. మున్సిపాలిటీలో 28 వార్డులకు గాను 14 వార్డులు వైసిపి కైవసం చేసుకోగా, టిడిపి 12 వార్డులు, జనసేన 01, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డు కైవసం చేసుకున్నారు. మ్యాజిక్ ఫిగర్ చేరుకునేందుకు ఒక్క సీటు అవసరం కాగా, ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటుతో వైసిపి బతికి బట్టకట్టింది. మున్సిపాలిటీ మొత్తం దృష్టిని ఆకర్షించిన 25, 26 వార్డులలో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి, చిన్న కుమారుడు రాజేష్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొని విజయం సాధించారు. 15 వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి పెదిరెడ్ల శ్రీనివాసరావు అధికార పార్టీకి చుక్కలు చూపించారు. వైసీపీ అభ్యర్థి మాకిరెడ్డి బుల్లిదొర ఆరు ఓట్లతో గట్టెక్కారు. అయితే 14 వ వార్డులో మాత్రం పోరు హోరా హోరీగా సాగింది. 2 పోస్టల్ బ్యాలెట్ లతో సైకిల్ ఒడ్డెక్కింది. తొమ్మిదో వార్డ్ లో జనసేన బోణీ కొట్టింది. సుమారు 290 ఓట్లతో అద్దేపల్లి సౌజన్య ప్రధాన పార్టీలకు ఝలక్ ఇచ్చారు. 1, 2, 3 వార్డులలో ఉంగరం గుర్తుపై పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థులలో మూడో వార్డు నుండి చెక్కా బాలమ్మ విజయం సాధించారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలలో టిడిపి గట్టి పోటీయే ఇచ్చింది. పంచాయతీ ఎన్నికలలో నర్సీపట్నం మండలంలో 12 పంచాయతీలలో ఐదు పంచాయతీలు కైవసం చేసుకోగా, ప్రస్తుతం మున్సిపల్ ఎలక్షన్లలో 12 వార్డులు కైవసం చేసుకొని టిడిపి సత్తా చాటింది. గత సాధారణ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే ఈ విధంగా స్థానిక ఎన్నికలలో నానా అవస్థలు పడటం రాజకీయ విశ్లేషకులను విస్మయపరిచింది.

No comments:
Post a Comment