ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతమైన బలపం పంచాయతీ, ఆ చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు విశాఖ రూరల్ పోలీసులు ఏర్పాటు చేసిన ఉచిత ఆర్టీసీ బస్సు సర్వీస్ ను సద్వినియోగం చేసుకోవాలని చింతపల్లి ఏ ఎస్ పి విద్యాసాగర్ నాయుడు అన్నారు. మండలంలోని అన్నవరం గ్రామంలో సోమవారం పాడేరు ఆర్ టి సి డిపో మేనేజర్ ఆర్ ఎస్ నాయుడు తో కలిసి ఆయన అన్నవరం నుండి మూల కోత్తూరు మీదుగా బలపం కోరుకొండ కు ఉచిత ఆర్టీసీ బస్సు సర్వీసును జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్యంలో మారుమూల గిరిజన గ్రామాల ప్రజల సౌకర్యార్థం రూరల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రారంభించ బడిందని, ఇప్పటివరకు ఈ ప్రాంతంలో సరైన రహదారి రవాణా సౌకర్యాలు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తమ శాఖ మారుమూల ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు ఇందులో భాగంగా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయడమే కక నేడు రహదారి సౌకర్యాన్ని కల్పించి అన్నవరం నుండి మూల కొత్తూరు గ్రామం వరకు ఉచిత ఆర్టీసీ బస్సు సర్వీసును నడపడం జరిగిందన్నారు. ఈ మధ్యకాలంలో రహదారి శిథిలావస్థకు చేరడంతో గతుకుల మాయమైన రహదారిలో ఆర్టీసీ సర్వీసు తిరగలేని పరిస్థితి నెలకొందన్నారు. అప్పటి నుండి ప్రైవేటు వాహనాలలో పరిమితికి మించి ప్రయాణికులు రాకపోకలు సాధిస్తుండడం తో పలుమార్లు ప్రమాదాలు చోటు చేసుకొని పలువురు గిరిజనులు మృత్యువాత పడిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు.
వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని బలపం పంచాయతీ పరిధిలో 33 గ్రామాల ప్రజలతో పాటు ఆ పంచాయతీని ఆనుకుని ఉన్న ఒరిస్సా ప్రజలకు కూడా సౌకర్యార్థం గా ఉండేవిధంగా అన్నవరం నుండి కోరుకొండ వరకు అందంగా తయారైన రహదారిని మరమ్మతులు చేయించి ఉచిత ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిపేందుకు పాడేరు ఆర్టిసి డిపో మేనేజర్ తో చర్చించి అన్నవరం, కోటగున్నల, నిమ్మపాడు, రాళ్ల గెడ్డ, మూల కొత్తూరు, మీదుగా కోరుకొండ గ్రామం వరకు ఉచిత ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ సర్వీసు ప్రతిరోజు మూడు సార్లు అన్నవరం నుండి కోరుకొండ వరకు ఉచితముగా నడుపబడునన్నారు ఈ ఆర్ టి సి బస్సు సర్వీసును ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకొని సురక్షితమైన ప్రయాణానికి నాంది పలకాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చింతపల్లి సీఐ శ్రీనివాస్ అన్నవరం ఎస్ఐ ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.








